(AP Medical & Health 2008 Roundup)
ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించినా ముఖ్యమంత్రి వైఎస్ మానస పుత్రికైన `ఆరోగ్య శ్రీ' జనాకర్షణ పథకంగా నిలిచింది. విధి నిర్వహణలో ఉండే వైద్యులను దాడుల నుంచి కాపాడేందుకు దేశంలోనే తొలిసారిగా చట్టపరమైన రక్షణ తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. తొమ్మిదేళ్ల తరువాత మూడు కొత్తగా మూడు మెడికల్ కాలేజీల (రిమ్స) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ జరుగుతున్నా ప్రజల ఆరోగ్య ప్రమాణాలు `ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందానే ఉన్నాయి.
జనాకర్షణ పథకం 2008 - `ఆరోగ్య శ్రీ'!
సోనియా గాంధీ ఈ ఏడాది జూలై 17 న నెల్లూరులో ఆరోగ్య శ్రీ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రజలు, అధికారుల నుంచి ఆరోగ్య శ్రీపై ఎన్ని ప్రశంసలు కురిశాయో, ప్రతిపక్షాలు, వైద్య నిపుణులు, మేథావుల నుంచి అంతకు రెట్టింపు విమర్శలనూ మూటకట్టుకుంది. ఆరోగ్య శ్రీ ద్వారా అందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అని ప్రభుత్వం ఊదరగొడుతున్నా... రాష్ట్ర ప్రజలందరి వైద్య అవసరాలు తీర్చే సమగ్ర వైద్యబీమా పథకంగా ప్రభుత్వం తీర్చిదిద్దలేదు. ప్రజలకు ఈ పథకం మంచిదా? చెడ్డదా? అన్నది అప్రస్తుతం. పేదలకు అందుతున్న ఇన్స్టంట్ ఫలితాల దృష్టా్య ప్రతిపక్షాల లాజిక్లు దీనిపై తీవ్రంగా పనిచేయడం లేదు. ఎవరు అవునన్నా, కాదన్నా `ఆరోగ్య శ్రీ' కాంగ్రెస్ పాలకుల ఖాతాలో మరో జనాకర్షక పథకంగా నిలిచిపోయింది. దీన్ని చూసిన మిగిలిన రాషా్టల్రు పేర్లు మార్చి అమలు చేసేందుకు ఉవ్విళ్లూ రుతున్నాయి. కర్ణాటక దీనిని ఇప్పటికే `యశస్విని' పేరుతో అమలు చేస్తుండగా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తదితర రాషా్టల్రు ఈ పథకంపై ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయి.
డాక్టర్లకు చట్ట రక్షణ:
గత ఏడాది చివర్లో జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ వైద్య సిబ్బందిపై రాజకీయ ప్రోద్బలంతో దాడులు జరగడంతో వారికి చట్టపరంగా రక్షణ అవసరమని ఆందోళనలకు దిగారు. దీనిపై ప్రభుత్వం మొదట ఆర్డినెన్స జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏప్రిల్ 27న డాక్టర్ల రక్షణకు 11వ బిల్లును ఆమోదింపజేసింది. దీని ప్రకారం ఎవరైనా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు దిగితే మూడేళ్లపాటు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి. దీంతో పాటు... చికిత్స చేస్తుండగా ఎవరైనా రోగి చనిపోతే ఆయా డాక్టర్లపై గతం లో ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం విచారణ లేకుండానే కేసులు పెట్టరాదని 323 జీఓను జారీ చేసింది. నాన్టీచింగ్, ఇఎస్ఐ డాక్టర్లకు తాయిలాలు: రాష్ట్రంలోని నాన్ టీచింగ్ వైద్యులకు యుజీసీ స్కేళ్లు ఇవ్వకపోయినా అత్యవసర వైద్య సేవల ఎలవెన్సు పేరుతో నెలకు రూ. 3000 పెంచే ఏర్పాటు చేశారు. టైం బౌండ్ ప్రమోషన్లకు హామీ ఇచ్చారు. పీజీ వైద్య విద్యార్థులకు రూ. 1500 ఎలవెన్సులు కూడా వర్తిస్తాయి. వీటికోసం జీఓ387 జారీ చేశారు.
3 కొత్త కళాశాలలు:
రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తరువాత మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాజీవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్సెస్ (రిమ్స) పేరుతో ఆదిలాబాద్, శ్రీకాకుళం, ఒంగోలు జిల్లాల్లో వీ ఏర్పా టు చేస్తున్నారు. ఒక్కో కాలేజీలో 100 మంది ప్రవేశానికి వీలు కల్పిం చారు. మరో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని వైఎస్ ప్రకటించారు.
అనారోగ్య ముఖచిత్రం: ఫ్యామిలీ హెల్త సర్వే
రాష్ట్రం హెచ్ఐవీ కేసుల నమోదులో దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. 35 శాతం మంది స్త్రీలు గృహహింస ఎదుర్కొంటున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ఫలితాలు వెల్లడించాయి. పిల్లల్లో పౌష్టికాహార లోపాలు, రక్తహీనత ఇంకా సమస్యలుగానే ఉన్నాయని, టీకాల కార్యక్రమం అరకొరేనని ఫ్యామిలీ హెల్త సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
104 - ఫోన్, మొబైల్ సేవలు:
ప్రారంభ స్థాయిలోనే వ్యాధుల నిర్థారణ, పరీక్షల కోసం 104 మొబైల్ వ్యాన్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాన్యులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 104 టోల్ ఫ్రీ నంబరు ద్వారా వైద్య నిపుణుల సలహాలు సూచనలు తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.ఇక ప్రభుత్వాసుపత్రులు మాత్రం అరకొర మౌలిక వసతులు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో ఈ ఏడాది గడిపేశాయి. టీచింగ్ హాస్పిటళ్లు మొదలుకొని పీహెచ్సీల వరకు ఉన్న సమస్యలు ఇసుమంత కూడా మారలేదు. మెడికల్ కాలేజీల్లో కూడా 35 శాతం ఫ్యాకల్టీ కొరతతోనే కొనసాగుతున్నాయి. దీంతో భావి డాక్టర్లు, వైద్య సిబ్బంది నాణ్యమైన శిక్షణతో బయటకొస్తారా? అన్న సందేహాలు పీడిస్తున్నాయి.
No comments:
Post a Comment